పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ దాడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా, పాక్ సరిహద్దు గ్రామాల్లో, నగరాల్లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఎల్ వోసీ దగ్గర భారత్ లోని గ్రామాలపై పాన్ సైనికులు జరుపుతున్న కాల్పుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారు. ఇక, పాక్ చేస్తున్న డ్రోన్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. ఈ హై టెన్షన్ వాతావరణం నేపథ్యంలో నిన్నటి ధర్మశాల ఐపీఎల్ మ్యాచ్ ను కూడా అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇక, తాజాగా ఐపీఎల్ టోర్నీని నిరవధిక వాయిదా వేస్తున్నామని బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది.
ఐపీఎల్ లో పాల్గొంటున్న దేశీ, విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రత తమకు ముఖ్యమని, ముందస్తు జాగ్రత్తగా టోర్నీకి బ్రేక్ ఇస్తున్నామని బీసీసీఐ తెలిపింది. ముఖ్యంగా భారత్ లో ఉన్న విదేశీ ఆటగాళ్ల భద్రతపై వారి క్రికెట్ బోర్డులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐపీఎల్ ను మధ్యలో ఆపేస్తే ఆర్థికంగా నష్టమని తెలిసినా… దేశ భద్రత, ఆటగాళ్ల భద్రతపై రాజీ పడని బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, భద్రతా విభాగాలు, నిఘా విభాగాల నుంచి వచ్చిన సూచనలతో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఐపీఎల్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.