క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భారత్ విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్ర స్థావరాలను భారత త్రివిధ దళాలు ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా టెర్రరిస్తులను హతమర్చారు. ప్రతికారంగా పాక్ భారత్ లోని పలు నగరాలను టార్గెట్ చేస్తూ క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో దాడులకు తెగబడింది. పాక్ ఎత్తులను చిత్తు చేస్తూ భారత్ అంతే ధీటుగానే బుద్ధి చెబుతోంది.
ఇటువంటి పరిణామాల నడుమ ఐపీఎల్ ను నిర్వహించడం సరికాదని భావించిన బీసీసీఐ.. శుక్రవారం ఉదయం అత్యవసర సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఐపీఎల్ లీగ్ దశలో ఇంకా 16 మ్యాచ్లు ఉన్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, లఖ్నవూ, చెన్నై, బెంగళూరు, జైపుర్, ముంబై నగరాలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం యావత్ దేశం ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి సమయంలో ఆడగాళ్లతో పాటు ప్రేక్షకుల భాద్రత కూడా చాలా ముఖ్యం.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ను పోస్ట్పోన్ చేయాలని బీసీసీఐలోని సభ్యులందరూ నిర్ణయించారు. ఈ నిర్ణయం దేశీయ క్రికెట్, వ్యాపార పరంగా చాలా పెద్ద దెబ్బే అయినప్పటికీ.. జాతీయ భద్రతలో రాజీ పడకూడదని బీసీసీఐ భావిస్తోంది. కాగా, ఐపీఎల్ 2025లో 58 మ్యాచ్లు పూర్తయిన తర్వాత, ప్లేఆఫ్లు మరియు ఫైనల్తో సహా ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. భద్రత కారణాల దృష్ట్యా ఆటగాళ్లను వెంటనే వారి హోటళ్లకు తిరిగి పంపించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులనూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్కతాలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ఐపీఎల్ వాయిదాతో మిగిలిన మ్యాచులకు కొత్త షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంటుంది. మే 9 నాటికి, ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 11 మ్యాచ్లు ఆడి 16 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. 16 పాయింట్లతో ఆర్సీబీ, పంజాబ్ రెండు, మూడు స్థానాలో ఉన్నాయి.