సీఎం చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో పురోగతి పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరుస్తున్నాయి. వీటిలో సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇప్పుడు కొత్త యూనిట్ల స్థాపన, విస్తరణకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఆయా నియోజకవర్గాల్లో ఉపాధి.. ఉద్యోగాలు పెరుగుతున్నాయి.
త్వరలోనే జిల్లాలో 10 భారీ, మెగా పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రాబోయే రెండేళ్ల లో సుమారు 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఆయా నియోజకవ ర్గాల ఆర్థిక ముఖ చిత్రం మారనుందని నేతలు చెబుతున్నారు. గూడూరు మండలంలోని వెడిచెర్లలో రూ.437 కోట్లతో రెడ్సన్ సంస్థ యూనిట్ పనులు ప్రారంభమ య్యాయి. ఇక్కడ 450 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.
శ్రీసిటీలోని హైటియాన్ మెషినరీ పరిశ్రమ అక్టోబరులో ఉత్పత్తిని ప్రారంభించనుంది. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ని అపాచీ ఫుట్వేర్ పరిశ్రమ ద్వారానే 10 వేల మందికి ఉపాధి లభించనుందని అంచనా. దీంతో ఇక్కడ నుంచి పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లే కార్మికులకు ఇక తెరపడనుంది. దీనికి ఏపీఐఐసీ 298 ఎకరాలు కేటాయించింది. తద్వారా.. పనులు వేగంగా పుంజుకుంటున్నాయి.
హిల్టాప్ సెజ్ డెవలప్మెంట్ ఆప్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, హిండాల్కో, మోండలేజ్, బిర్లా కార్బన్, అల్ట్రా మెరైన్ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్, కలర్షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రెడ్సన్ సీమ్లెస్ పైప్స్, బ్లూస్టార్, హైటియాన్ మెషినరీ.. కంపెనీలకు చెందిన యూనిట్లకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి.
ఫలితంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లా సమగ్ర స్వరూపం మారిపోతుందని.. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడి ప్రజలకు చేతినిండా పనులు దొరకడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ఇదేజరిగితే.. చిత్తూరు జిల్లా కాస్తా.. చంద్రబాబు జిల్లాగా మారనుందని అంటున్నారు.