`ఆపరేషన్ సిందూర్`.. సమర్థవంతంగా సాగుతోందని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. తాజాగా మీడియా తో మాట్లాడిన వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, సైనికాధికారి సోఫియా ఖురేషీ పలు విషయాలను వెల్లడించారు. సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం అతిగా ప్రవర్తిస్తోందని తెలిపారు. జనావాసాలపైనా దాడులు చేసేందుకు ప్రయత్నించిందని అయితే.. భారత్ సైన్యం దానిని తిప్పికొట్టినట్టు పేర్కొన్నారు. భారత ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిపారు. భారత సైన్యం వీటిని సైతం తిప్పికొట్టినట్టు వివరించారు.
ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్థాన్ కాల్పులు జరుపుతోందని.. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వ్యోమికా సింగ్ తెలిపారు. దీంతో పలువురు గాయపడ్డారని.. భారత సైన్యం ఎదురు దాడులు చేస్తోందని, సమర్థవంతంగా తిప్పికొడుతోం దని వెల్లడించారు. దేశ పశ్చిమ సరిహద్దుల వెంబడి సైనిక పోస్టులపై దాడులు పెరిగాయన్న ఆమె.. పంజాబ్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధం చేసినట్టు వివరించారు. “భారత సరిహద్దు రేఖ వెంబడి పాకిస్తాన్ 36 చోట్ల దాడులకు తెగబడింది.“ అని తెలిపారు.
పౌర విమానాలను కవచంగా చేసుకొని దాడులు చేస్తోందని, కైనెటిక్, నాన్ కైనెటిక్ పరికరాలతో భారత్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతోందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ శిథిలాలను భారత ఆర్మీ పరిశీలించగా టర్కీకి చెందిన డ్రోన్స్ గా గుర్తించారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ ప్రాంతంలో భారత ఆర్మీ వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశాయని పేర్కొన్నారు. పాక్ పౌరులకుఎలాంటి ఇబ్బందులూ రాలేదని.. ప్రజలపై భారత దళాలు దాడులు చేయలేదని వివరించారు.
కానీ, ఎల్ వో సి వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతోందన్నారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత్ ఆర్మీ తిప్పి కొడుతోందని, భారత వైమానికాదళం చాలా సంయమనం పాటిస్తోందని వ్యోమికా సింగ్ వివరించారు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లాహోర్ – కరాచీ మధ్య విమాన రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దాడులకు మతం రంగు పూసేందుకు, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ తీవ్రంగా తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. భారత సైనిక స్థావరాలపై పాక్ జెట్ ఫైటర్లతో దాడులు చేయడానికి ప్రయత్నించగా భారత వైమానిక దళం తిప్పి కొట్టిందని వివరించారు.