చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ల మధ్య యుద్ధం తప్పదేమో అనుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. తాజాగా భారత విదేశాంగ శాఖ, పాక్ మంత్రి ఇషాక్ దార్ కూడా కాల్పుల విరమణ ఒప్పందంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.
భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని, ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అది అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు పాకిస్థాన్ విదేశాంగ శాఖతో భారత విదేశాంగ శాఖ శాంతి చర్చలు జరుపుతుందని చెప్పారు.
మిలటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ..ఇలా మూడు విభాగాలకు కాల్పుల విరమణ వర్తిస్తుందని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామని, పాక్ ఎల్లపుడూ శాంతి కోరుకుంటుందని ఇషాక్ దార్ వెల్లడించారు. కాల్పుల విరమణ వార్త విని ఇరు దేశాలలో సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
అంతకుముందు, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాత్రి మొత్తం సుదీర్ఘ చర్చలు జరిపామని, ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ అన్నారు. ఇండియా, పాక్ తెలివైన నిర్ణయం తీసుకున్నాయని అన్నారు.