రిటైర్డ్ ఐపీఎస్, ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు (ఏబీవీ)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీవీపై వైసీపీ హయాంలో నమోదైన కేసును, చార్జిషీట్ను హైకోర్టు కొట్టి వేసింది. ఏసీబీ మోపిన అభియోగాలకు ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు కొట్టివేస్తున్నామని కోర్టు వెల్లడించింది. దీంతో, ఏబీవీకి భారీ ఊరట లభించినట్లయింది.
భద్రత, నిఘా పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 2021 మార్చిలో ఏబీవీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ 2022లో ఏబీవీ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ తుది తీర్పు వెలువరించారు. పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఖర్చు చేయ లేదని, అనుచిత లబ్ధి పొందే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఏబీవీ తరఫు న్యాయవాది వాదించారు. ఏబీవీ కుమారుడికి చెందిన ‘ఆకాశ్ అడ్వాన్స్డ్ సిస్టమ్’ సంస్థకు, టెండర్ దక్కించుకున్న ఇజ్రాయెల్ సంస్థతో అనుబంధం లేదని ఇజ్రాయెల్ కంపెనీ స్పష్టం చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు.