15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా గాలికి మరో షాక్ తగిలింది. మైనింగ్ కేసులో హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్ధన్ ను దోషిగా నిర్ధారించడంతో ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. బీజేపీ నుంచి గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక శాసనసభ అనర్హత వేటు వేసింది.
కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కోర్టు తీర్పును స్వాగతించిన కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ.. గాలిపై వేటు వేసి శాసనసభలో ఒక స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. త్వరలోనే ఆ స్థానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇకపోతే ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కెరీర్ ప్రారంభించిన గాలి.. ఆ తర్వాతి కాలంలో మైనింగ్ కింగ్ గా మారారు. కొండలు, గుట్టలు కొట్టి అడ్డంగా సంపాదించారు. జగన్ తో చేతులు కలిపి అక్రమ మైనింగ్ ద్వారా దోపిడీలకు పాల్పడ్డారు.
2011లో మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన గాలి.. వ్యవస్థలను ఎంతలా మేనేజ్ చేసినా చివరకు జైలు శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయన సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పటికే జప్తు అయ్యాయి. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం కలిగించారని నిర్ధారణ కావడంతో.. గాలి ఆస్తులను ప్రభుత్వమే జమ చేసుకుంటుంది. తాజాగా ఎమ్మెల్యే పదవి కూడా హూస్ట్ అయింది. గాలి జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే.. జైలు శిక్ష పూర్తి అయిన తర్వాత కూడా మరో ఆరేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. అంటే గాలి పొలిటికల్ కెరీర్ ఇక క్లోజ్ అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.