ఏపీలో సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకున్న సంగతి తెలిసిందే. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడంతో అమరావతి రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తి కావడం ఖాయం. సీఎం చంద్రబాబు చెప్పిన ఆ మాట విన్న ఇన్వెస్టర్లు అమరావతితో పాటు ఏపీలో పెట్టబుడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వంతో క్రియేటివ్ ల్యాండ్ ఏసియా సంస్థ చరిత్రాత్మక ఎంవోయూ చేసుకుంది. భారత దేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ ను ప్రజా రాజధాని అమరావతిలో పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమరావతి మీడియా సిటీలో తొలి పెట్టుబడి పెట్టబోతున్న సంస్థగా చరిత్ర సృష్టించనుంది.
ఏపీలోని యువతకు 25 వేల ఉద్యోగాలివ్వడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటు కానుంది. అంతేకాదు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ఎంవోయూ ఎంతగానో ఉపయోగపడనుంది. ఏపీ యువతలోని నైపుణ్యాన్ని పెంపొందించి దానిని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటు కానుంది. సినిమాలు, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, స్టోరీ టెల్లింగ్, ఏఐ కంటెంట్ వంటి వాటిని ప్రోత్సహించనుంది. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు క్రియేటర్ ల్యాండ్ అకాడమీ ఏర్పాటు చేయనుంది. క్రియేటివ్, డిజిటల్ ఇండస్ట్రీలకు ప్రపంచ స్థాయి వేదికగా అమరావతి రూపుదిద్దుకోనుంది.