తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు.. అనగానే ఎవరైనా ఏం చేస్తారు? ఆనందంతో ఎగిరి గంతేస్తారు. తనకు అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ, తాజాగా బీజేపీ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మాత్రం ప్రధాని మోడీ మనసెరిగి అడుగులు వేశారు. ఆయనకు అత్యంత ఇష్టమైన.. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేశారు.
బుధవారం తెలతెల వారుతూనే.. చేతికి చీపురుతీసుకుని.. స్వచ్ఛభారత్లోకి దిగిపోయారు. అయితే.. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. అదేంటంటే.. పుణ్యం పురుషార్థం అన్నట్టుగా.. అటు మోడీ మనసెరిగి మసులుకునే క్రమంలో చేసిన ఈ స్వచ్ఛభారత్తో పుణ్యం కూడా పోగు చేసుకునేందుకు.. ఏకంగా ఈ కార్యక్రమాన్ని శివాలయంలో ముర్ము చేపట్టడం.. గమనార్హం. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి.
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయనున్న ద్రౌపది ముర్ముకు కేంద్రం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. మరోవైపు, బుధవారం ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పుర్లోని శివాలయానికి వెళ్లారు. చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేసి అనంతరం దర్శనం చేసుకున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున ఝార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముర్ముకు కేంద్రం.. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి బుధవారం నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.
ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం.. ఒడిశాలోని రాయ్రంగ్పుర్లో ఉన్న శివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆలయ ప్రాంగణాన్ని చీపురు పట్టి శుభ్రం చేశారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకున్నారు. జహీరా అనే గిరిజన ప్రార్థన స్థలాన్ని కూడా ఆమె సందర్శించారు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు పొందుపరచి ఉన్నాయో.. వాటి ప్రకారమే పనిచేస్తానని ఆమె చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జూలై 18న జరగనుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ముర్ము గెలిస్తే… ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతితో పాటు దేశానికి రెండో మహిళా రాష్ట్రపతి అవుతారు.