ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఆయన ముందడుగు వేశారు. తన నెల జీతం మొత్తాన్ని తల్లిదండ్రులను కోల్పోయిన ఆనాథ పిల్లలకు అందించాలని నిర్ణయించుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లలు ఉండగా.. వారిందరికీ పవన్ వేతనం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు. మిగిలిన వేతనం కూడా వారి బాగోగులకే కేటాయిస్తానని.. తాను పదవిలో ఉన్నంత కాలం ఈ సాయం కొనసాగుతుందని పవన్ ప్రకటించారు.
అందులో భాగంగానే శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అనాథ పిల్లలతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు. అందుబాటులో 32 మంది పిల్లలు ఉండటంతో.. వారికి పవన్ స్వయంగా సాయాన్ని అందజేశారు. మిగిలిన పది మంది పిల్లలకు జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందించనున్నారు. ప్రతి నెలా ఇళ్ల వద్దకే వెళ్లి అనాథ పిల్లలకు ఆర్థిక సాయం అందించేలా ఏర్పాట్లు కూడా చేశారు.
పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై సార్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. పవన్ ఉదారతను అభిమానులే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెల జీతమెంత? అన్నది చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ ఉపముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు మంత్రి పదవిని కూడా తీసుకున్నారు. ఎమ్మెల్యే వేతనం, ఇతర అలవెన్సులతో పాటు మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందున అదనంగా కొంత వేతనం, ఇతర అలవెన్సులు కలిపి ప్రతి నెలా పవన్ కళ్యాణ్ రూ. 3 లక్షల మేర వేతనం అందుకుంటున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం పవన్ ఖర్చు పెట్టాలని నిర్ణయించుకోవడం నిజంగా గొప్ప విషమయే అని చెప్పొచ్చు.