ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ `ఆపరేషన్ సింధూర్` పేరుతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అమాయక పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ వెన్నులో వణుకు పుట్టేలా ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తోంది. అదేవిధంగా పాకిస్తాన్ కుట్రలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇటువంటి సమయంలో ఏపీ బీజేపీ నేతల తీరు విమర్శలకు దారి తీసింది. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇదే అంశాన్ని ఏపీ బీజేపీ నేతలు తమ రాజకీయ లబ్దీకి వాడుకోవాలని చూశారు.
అందులో భాగంగానే ఎక్స్ వేదికగా `ఆపరేషన్ సింధూర్.. మీ ఓటే వజ్రాయుదం! శత్రు దేశంపై కురుస్తున్న క్షిపణుల వర్షాన్ని చూసి సగటు భారతీయుడుగా మనందరి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది కదా! ఈవీఎంల మీద సరైన బటన్ నొక్కినందుకే ఇలాంటి ఘనత సాధ్యమైంది` అంటూ మోదీ నాయకత్వాన్ని, బీజేపీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. సరైన నాయకత్వానికి ఓటు వేస్తే భారత్ ఎలా విజయం సాధిస్తుందో మనందరం చూస్తున్నామంటూ సొంత డప్పు కొట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏపీ బీజేపీ నేతలపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
`ఇలాంటి టైమ్ లో పాలిటిక్స్ ప్రదర్శించకండి`, ` దేశ ప్రధాని గా అందరూ మోదీ గారికి గౌరవం ఇస్తున్నాం, ఇలాంటి సమయంలో ఒక బీజేపీ నేతగా మాత్రమే ఆయన్ను చూపద్దు`, ` ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు, ఇటువంటి క్లిష్ట సమయంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం మీ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది`, `ఎంత సిగ్గుచేటు, మీ చౌకబారు రాజకీయాల కోసం సైనికుల కష్టాన్ని ఉపయోగించుకోకండి`, `పెళ్ళికొడుకు మంచివాడిలా ఉన్నాడు రా అనే లోపు మొదలెట్టాడు అంట వాడి వేషాలు…అలా ఉంది` అంటూ నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తమ బీజేపీ నేతలపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.
`రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్క తాటి పైకి వచ్చి ఇండియన్ ఆర్మీ కి సపోర్ట్ చేస్తుంటే మీరు మాత్రం రాజకీయం చేసుకోండి.. ఇట్లాంటి టైమ్ లో ఈ పోస్టు అవసరమా.. దేశం అంటే మట్టి కాదు మనుషులు అని గురజాడ గారు అంటే ఈ బీజేపీ వాళ్లు మాత్రం దేశం అంటే ఓటర్లు అని అంటున్నారు` అంటూ మరో నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు.
మనం సరైన నాయకత్వానికి ఓటు వేస్తే భారత్ ఎలా విజయం సాధిస్తుందో మనందరం చూస్తున్నాం. ఇంకా చాలా ఘనతలు భారత్ ముంగిట ఉన్నాయి. అందుకే మన ఓటు వజ్రాయుధంతో సమానం.#Vote #PMModi #OperationSindoor pic.twitter.com/FRtMCZpIsq
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) May 9, 2025