సాధారణంగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులను పై కోర్టుల్లో సవాల్ చేయడం.. కొంత మేరకు ఉపశమనం పొందడం ఎవరికైనా కామనే. ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుందని చెప్పలేం. కొన్నికొన్ని సందర్భాల్లో ఊహించిన దానికంటే కూడా.. ఎక్కువగానే శిక్ష పడొచ్చు. ఇటీవల కాలంలో కొన్ని కొన్ని కేసులు ఇలానే జరుగుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ విషయంలో ఇలానే జరిగింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్గా ఉన్న తాతా మోహన్రావుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. దీంతో ఆయన `క్షమించమని` వేడుకున్నా.. “తప్పదు.. శిక్ష అనుభవించాల్సిందే“ అని తేల్చి చెప్పింది. దీంతో ఆయన `డిప్యూటీ` పోయి.. `తహసీల్దార్`గా పరిమితమయ్యారు.
ఏం జరిగింది?
తాతా మోహన్రావు.. గ్రూప్-1 రాసి.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో తహసీల్దార్గా ఉద్యోగం సంపాయించుకున్నారు. ఈయన తొలి పోస్టింగ్ గుంటూరులోనే వచ్చింది. దీంతో తొలినాళ్లలో దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో గుంటూరు బ్రాడీపేటలో ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న కొన్ని దుకాణాలను తొలగించారు. దీనిని ఆయన సంచలన నిర్ణయంగా అప్పట్లో పేర్కొన్నారు. అయితే.. తాము లైసెన్సు తీసుకునిదుకాణాలు ఏర్పాటు చేసుకున్నామని.. తమకు సమయం ఉందని అప్పటి వరకు వెయిట్ చేయాలని దుకాణదారులు మొర పెట్టుకున్నారు. అయినా.. తాతా మోహన్రావు దూకుడు ఆపలేదు.
ఈ క్రమంలో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. 2013లోనే హైకోర్టు.. వాటిని తొలగించవద్దు.. అని తీర్పు ఇచ్చింది. అయినా.. మనోడు వింటేనా? ఆక్రమణలు తొలగించాల్సిందే.. అంటూ.. రాత్రికి రాత్రి వాటిని తొలగించేశారు. దీంతో మరోసారి దుకాణ దారులు కోర్టు మెట్లెక్కారు. దీనిని విచారించిన కోర్టు.. మోహన్రావుకు కొన్నాళ్ల కిందట రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే.. అప్పటికే ఆయన ప్రమోషన్ పొంది.. డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. దీంతో తనను అరెస్టు చేస్తారన్న భయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు “ఆ శిక్ష చాలదు“ అని వ్యాఖ్యానించింది.
చట్టాలు, న్యాయస్థానాలంటే అధికారులకు లెక్కలేకుండా పోయిందని వ్యాఖ్యానించిన తదుపతి సీజేఐగా ఈ నెల 14న ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొద్ది సేపటికి.. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న తాతా మోహన్రావు.. ఏ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారని ప్రశ్నించారు. తహసీల్దార్గా ఆయన ఉద్యోగం పొందారన్న ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించి.. ఆయనను తహసీల్దార్గా తిరిగి పంపేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తదుపరి ప్రమోషన్ ఇచ్చేప్పుడు హైకోర్టుకు చెప్పాలని కూడా ఆదేశించింది. దీంతో మోహన్రావు మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. తనను క్షమించాలని ఆయన వేడుకున్నా సుప్రీంకోర్టు.. తప్పదు శిక్ష అనుభవించాలని వ్యాఖ్యానించింది.