తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై సమ్మె చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్న తరుణంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు అప్పు కోసం బ్యాంకుల వెళితే బ్యాంకర్లు స్పందించడం లేదని రేవంత్ చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి. తనను కోసినా ఒక్క రూపాయి రాదని, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
“నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు చెప్పండి… ఏ పథకం ఆపాలి? బోనస్ తీసుకుందామా? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా? ఏం చేద్దాం చెప్పండి…” అని రేవంత్ ఆవేశపూరితంగా మాట్లాడారు.
ఇటువంటి పరిస్థితుల్లో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుంని, ఆర్థికంగా దివాలా తీస్తామని అన్నారు. ఢిల్లీలో బ్యాంకర్లు అపాయింట్మెంట్ కోరితే ఇవ్వట్లేదని, చెప్పులు కూడా ఎత్తుకపోతారేమో అనిపిస్తోందని, దేశం ముందు తెలంగాణ పరిస్థితి హీనంగా ఉందని చెప్పారు.
“రోడ్లు వేయాలని అనుకుంటే అణాపైసా లేదు. కాంట్రాక్టర్లకు అప్పుల బకాయిలు వెయ్యి కోట్లకైనా ఇవ్వలేక పోతున్నాం. ఓ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎలా ఉంటుందో… ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి అలాగే ఉంది. గత పాలకులు వెనక్కి పెట్టిన రూ.8,500 కోట్ల రిటైర్మెంట్ బకాయిలను తీర్చాల్సిన బాధ్యత మాది. అలాంటిది… గతంలో ఎప్పుడూ జరగనట్టు, నెల మొదటివారంలోనే జీతాలు ఇచ్చే ప్రభుత్వంపైనే ఉద్యోగ సంఘాలు సమరం ప్రకటించడమేంటి?’’ అని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.