తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు.. ప్రస్తుత సీఎం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గట్టి సవాల్ రువ్వారు. గత బీఆర్ ఎస్ హయాంలో చేపట్టిన పథకాలను నిలుపుదల చేసి.. పేదలను ఘోష పెడుతున్నారని వ్యాఖ్యానించిన మాజీ సీఎంకు రేవంత్రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏం ఆగిందో చెప్పండి? అంటూ.. నిలదీశారు. తాజాగా రవీంద్ర భారతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. మాజీ సీఎంపై నిప్పులు చెరిగారు. “ప్రజలు గెలిపించి.. అసెంబ్లీకి పంపితే రానంటూ మారం చేస్తున్న నేతను ఏమనాలి? తాను రానప్పుడు తనకు ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదా ఎందుకు?“ అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన ప్రజలను మోసం చేస్తోంది ఎవరో అందరికీ తెలుసునని రేవంత్రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీ గుర్తుకు వస్తుందా? ఓడితే.. ప్రజలు, అసెంబ్లీ రెండూ మరిచిపోతారా? ఫాం హౌస్కే పరిమితం అవుతారా? అని ప్రశ్నలుగుప్పించారు. “బీఆర్ ఎస్ సభ పెట్టుకున్నారు. దానికి మేం సంపూర్ణంగా సహకరించాం. ఎన్ని బస్సులు అడిగితే అన్నీ ఇచ్చాం. అయినా.. మాపై నిందలు మోపారు. మా ప్రభుత్వాన్ని దూషించారు“ అని రేవంత్ అన్నారు. ఇక, అదే సభలో బీఆర్ ఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను తాము నిలుపుదల చేశామని వ్యాఖ్యానించారని.. మరి ఏ కార్యక్రమాలు నిలుపుదల చేశామో చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ రువ్వారు.
“ఏయే పథకాలు ఆపామో చెప్పాలి. నేను ఈ సభ నుంచే సవాల్ రువ్వుతున్నా.. నిరూపించండి“ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు. “రైతు బంధు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్య శ్రీ, ఎస్సీలకు, రైతులకు ఉచిత విద్యుత్.. ఎక్కడ ఏం ఆపామో చెప్పాలి? “ అని రేవంత్ రెడ్డి నిలదీశారు. గత ప్రభుత్వ పాపాలను ప్రక్షాళన చేసేందుకే తమకు ఏడాది సమయం పట్టిందని.. ఇంకా ఆ జాడ్యం మమ్మల్ని పీడిస్తోందన్నారు. తమ హయాంలో పేదలకు రూ.500లకే గ్యాస్ అందిస్తున్నామన్నారు. 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని.. 2.5 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెచ్చామని.. ఇది అభివృద్ధి కాదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
“ప్రపంచస్తాయిలో హైదరాబాద్ను విస్తరిస్తున్నాం. దేశ దేశాలకు తిరిగి పెట్టుబడులు తెస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాకే.. తెలంగాణ మహిళలకు.. ఉచిత బస్సు అందుబాటులోకి వచ్చింది. కష్టమైనా అన్నీ భరిస్తున్నాం.. ప్రజలనుఅక్కున చేర్చుకుంటున్నాం. ఇదే బీఆర్ ఎస్ నాయకుడికి నచ్చడం లేదు. కడుపు నిండా విషం నింపుకొని విద్వేషపూరిత ప్రసంగంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని.. రోజూ దేవుడిని కోరుకుంటున్నారు. అయినా.. మీరు ఎన్ని చేయాలని అనుకున్నా..ప్రజలనే దేవుళ్లుగా భావించే మాకు ఆ దేవుళ్ల ఆశీర్వాదమే ఉంది“ అని రేవంత్ ఒకింత.. భావోద్వేగంగా ప్రసంగించారు.