ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మే 2వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రీలాంచ్ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలోనే మోదీని అమరావతికి ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు అమరావతికి రావాలని ఆయనను ఆహ్వానించారు.
దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన మోదీ చేతుల మీదుగా జరగాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా మోడీ, చంద్రబాబుల మధ్య రాష్ట్ర దేశ రాజకీయాలకు సంబంధించి పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడిని ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కేంద్రం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతునిస్తుందని చంద్రబాబు మోదీతో చంద్రబాబు చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కు పాదం ఆపాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదులను ,ఏరివేయాలని మోదీతో చంద్రబాబు అన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ అమరావతి పర్యటన రద్దవుతుందని పుకార్లు వచ్చాయి. మోదీ పర్యటన వాయిదా పడుతుందని చాలామంది భావించారు. అయితే, మోదీ అమరావతి పర్యటన యథావిధిగా కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. తాజాగా చంద్రబాబు, మోదీల భేటీ తర్వాత పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.