ఏపీ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్ సెట్ షిఫ్ట్ ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తొలి కాపీని చంద్రబాబు అందించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, చిరంజీవిలకు శరణి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి వారిద్దరూ సరదాగా సమాధానమిచ్చారు. ‘నారాయణ విద్యా సంస్థలు ఒక బ్రాండ్. ఆర్డినరీ స్టూడెంట్లను ఎక్స్ట్రా ఆర్డినరీగా మారుస్తారు’ అని చంద్రబాబు కొనియాడారు.
శరణిని కలిసినప్పుడు చిన్న పిల్ల అనుకున్నానని, నారాయణ పెంపకంలో ఆమె ఎదిగిన తీరు చూసి ముచ్చటేస్తోందని చెప్పారు. తండ్రిచాటు బిడ్డల్లా నారాయణ సంస్థలను నడుపుతున్నారనుకున్నానని, కానీ, శరణి, ఆమె సోదరి చిన్న వయసులోనే ఎంతో సాధించారని అన్నారు. మైండ్ సెట్ అనేది ప్రతి మనిషిలో కీలకం అని, ఎన్ని ఇబ్బందులొచ్చినా పాజిటివ్గా ఆలోచించాలని అన్నారు. పాజిటివ్ థింకింగ్ వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని, నమ్మకానికి సంకల్పం తోడైతే ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చని చెప్పారు
తానైనా, చిరంజీవి అయినా, ఎన్టీఆర్ అయినా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారమేనని, దృఢసంకల్పం వల్ల ఒక మనిషి ఏ స్థాయికి వెళ్లవచ్చు అనేదానికి ఎన్టీఆర్ జీవితం ఓ ఉదాహరణ అని అన్నారు. చిరంజీవి ఒక సంకల్పందతో అద్భుత నటుడయ్యారని, చిరంజీవి తన జీవితంలో పాజిటివ్ మైండ్సెట్ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని ఛేదించేవరకు నిరంతర కృషి చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ ఉన్నంతకాలం చిరంజీవి ఒక స్థాయికి ఎదిగారని, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆకాశమే హద్దుగా చిరంజీవి మహానటుడిగా ఎదిగారని ప్రశంసించారు.