దాతృత్వంలో తన చేతికి ఎముక లేదని పేరు తెచ్చుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన పేరును హైదరాబాద్లో సైతం వినిపించేలా చేశారు. ఇటీవల రంజాన్, శ్రీరామనవమి సందర్భగా నియోజకవర్గం ప్రజలకు ఆయన మటన్, బెల్లాన్ని విరివిగా దానం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఆయనకు మంచి పేరు తెచ్చింది. అయితే.. ఎక్కడా తన ఓన్గా ఆయన ప్రచారం చేసుకోలేదు.
కూటమి పార్టీల తరఫునే తాను ప్రజలకు సాయం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తాజాగా ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు శాస్త్రీయ అధ్యయన యాత్రలో భాగంగా గురువారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పర్యటిస్తున్న ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 250 మంది చిన్నారులకు, వారి వెంట ఉన్న సిబ్బందికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు.
హైదరాబాద్ లోని ఐ – మ్యాక్స్ వద్ద ఉన్న ప్రముఖ ప్యారడైజ్ హోటల్ లో లంచ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేడి వేడి హైదరాబాద్ బిర్యానీని వడ్డించేలా ఏర్పాట్లు చేయడం గమనార్హం. దీనికి సంబంధించి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చయినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూపిన ప్రేమాభిమానాలకు విద్యార్థులు, సిబ్బంది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు నుంచి శాస్త్రీయ అధ్యయన యాత్రకు బయలుదేరిన విద్యార్థులకు బుధవారం రాత్రి కావలసిన సౌకర్యాలు అందించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ యాత్రను జండా ఊపి ప్రారంభించారు. ఇక, హైదరాబాద్కు చేరుకున్న విద్యార్థులకు సొంత ఖర్చులతో విందును కూడా ఇచ్చారు. ఇలా.. చింతమనేని దాతృత్వం రాష్ట్రాలను కూడా దాటడం పట్ల రాజకీయ వర్గాలలో ఆయన దాతృత్వంపై ప్రత్యేక చర్చ సాగుతుండడం గమనార్హం.