`ఆపరేషన్ సింధూర్`.. దేశమంతటా ఈ పేరే వినపడుతోంది. పహల్గామ్లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతికారం తీర్చుకోవడం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేయడం, ఈ దాడితో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించడంతో దేశం మొత్తం భారత సైన్యానికి జేజేలు కొడుతోంది.
అయితే పాకిస్తాన్కు సన్నిహిత మిత్రదేశమైన చైనా బుద్ధి మాత్రం మారలేదు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించినప్పటికీ పాకిస్తాన్కే మద్దతు పలికిన చైనా.. తాజాగా ఆపరేషన్ సింధూర్పై కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దళాలు చేపట్టిన దాడుల పట్ల చైనా విచారం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సింధూర్ తక్షణమే నిలిపివేయాలంటూ చైనా విజ్ఞప్తి చేసింది.
భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిణామాలపై తాము ఆందోళన చెందుతున్నామని.. ఇప్పుడున్న పరిస్థితి మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరుదేశాలను కోరింది. శాంతి మరియు స్థిరత్వాన్ని ముందుంచాలని, ప్రశాంతంగా ఉండాలని, అలాగే సంయమనం పాటించాలని భారతదేశం మరియు పాకిస్తాన్లకు చైనా పిలుపునిచ్చింది.