సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటసింహం నందమూరి బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిదే. బాలయ్యను పద్మభూషణ్ వరించడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ఆయన సోదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ఫామ్హౌస్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి నారా, నందమూరి కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ నుంచి కొందరు దర్శక-నిర్మాతలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తన బావమరిది బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వేదికపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఓపక్క బాలయ్య, మరోపక్క భూవనేశ్వరి. ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదకరం అంటూ పంచ్ వేశారు. తన అన్నయ్య మీదున్న ప్రేమతో భూవనేశ్వరి ఈ వేడకను ఏర్పాటు చేసిందని చంద్రబాబు తెలిపారు.
బాలయ్య గురించి మాట్లాడుతూ.. `నిన్నటి వరకు అల్లరి బాలయ్య.. ఇప్పడు పద్మభూషణ్ బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ. మా కుటుంబంలో ఇంత పెద్ద అవార్డు రావడం ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులందరం ఎంతో ఆనంద పడుతున్నాం. బాలయ్య మా కుటుంబ సభ్యుడు అయినందుకు మనస్ఫూర్తిగా గర్విస్తున్నాను. ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు బాలయ్య చేశారు. ఇది బిగినింగ్ మాత్రమే.. అన్ స్టాపబుల్ లో ఒక స్టెప్ ఇది. వివిధ రంగాల్లో బాలయ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాకంటే బాలయ్య నాలుగేళ్లు సీనియర్. 1974లో తొలిసారి ఆయన సినిమాల్లోకి వస్తే.. 1978లో నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారంటే పట్టుదల క్రమశిక్షణతోనే సాధ్యమైంది. బాలయ్య పైకి అల్లరిగా కనిపించిన.. లోపల ఎంతో క్రమశిక్షణ గా ఉంటారు. మూడు గంటలకే నిద్ర లేచి పూజ చేస్తారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. 50 సంవత్సరాలుగా ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తున్నారు. హిట్లు కొడుతూనే ఉన్నారు. ఏ సినిమాలో చూసిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా, గ్లామరస్ గా కనిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన్ను రెండో కోణంలో చూస్తే.. బాలయ్య ఒక మానవతావాది. కేన్సర్స్ ఆస్పత్రిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నేడు దేశంలోనే గొప్ప ఆస్పత్రుల్లో ఒకటిగా ఉంది.
అలాగే ముచ్చటగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మూడుసార్లు కాదు ఆయన ఉన్నంతవరకు ఆయనే ఎమ్మెల్యే. ఒక్కోసారి వసుంధరకు సీట్ ఇవ్వమని అంటుంటారు. నిజంగా అంటాడో.. ఆమెను మెప్పించడానికో తెలీదు. అయితే ఎంత ఎమోషనల్గా ఉంటాడో అంతే మంచి మనిషి` అంటూ చంద్రబాబు తన బారమరిదిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.