ఇంట్లోని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ, పెళ్లి చేసుకునే జంటలకు సంబంధించి తాజాగా అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. పేరెంట్స్ కు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే జంట.. ఆ ఒక్క కారణాన్ని చూపించి పోలీసు రక్షణ కోరలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ జీవితానికి.. స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉంటే తప్పించి వారికి భద్రత కల్పించలేమని స్పష్టం చేసింది.
పెద్దల ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే జంటలు.. ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని కోర్టు పేర్కొంది. యూపీకి చెందిన శ్రేయ కేసర్వానీ పెద్దలను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించాలని.. వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. ఇటీవల ఆమె.. శ్రేయ భర్త కలిసి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీరి పిటిషన్ ను పరిశీలించిన తర్వాత ఈ జంటకు ఎలాంటి తీవ్రమైన ముప్పు పొంచి లేదని.. కేవలం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే..ఆ జంటకు పోలీసు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహా కేసులకు సంబంధించి తీర్పు ఇచ్చినట్లుగా పేర్కొంది.
పిటిషనర్ల జీవితానికి.. వారి స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పే ఒక్క కారణం కూడా లేనప్పుడు.. భద్రత సౌకర్యాన్ని ఎందుకు ఇవ్వాలన్నది హైకోర్టు ప్రశ్నగా మారింది. నిజంగా జీవితానికి ముప్పు ఉంటే.. రక్షణ కల్పిస్తామని.. అలాంటి ప్రమాదం లేనప్పుడు.. సమాజాన్ని ఎదుర్కోవటానికి సదరు జంట ఒకరికొకరు అండగా నిలవాలని పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.