జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం లో 28 మంది అమాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA) ఆధ్వర్యంలో అమెరికాలోని మిల్పిటాస్ లో క్యాండిల్ లు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని క్యాండిళ్లు వెలిగించి పహల్గాం ఉగ్రదాడి నిందితులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు ఎన్నారైలు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
పహల్గాం ఉగ్రదాడిని ఎన్నారైలు తీవ్రంగా ఖండించారు. ఆ ఘాతుకానికి పాల్పడ్డ ఉగ్రవాదులను, వారిని ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎన్నారైలు భారత, అమెరికా ప్రభుత్వాలను కోరారు. ఈ సంఘీభావ సభలో పలు మతాలు, సంస్థలకు చెందిన వారు పాల్గొన్నారు. ఇది మానవత్వంపై జరిగిన దాడి అని, ఉగ్రవాదానికి మతం లేదని వారు అన్నారు.
శాంటా క్లారి సిటీ కౌన్సిల్ సభ్యులు రాజ్ చహల్, సడ్స్ జైన్, ఫ్రీమోంట్ సిటీ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ యంగ్ షావో, ఫ్రీమొంట్ యునైటెడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ సభ్యులు వివేక్ ప్రసాద్, మిల్పిటాస్ సిటీ స్కూల్ డిస్ట్రిక్ట్ మెంబర్ డాక్టర్ అను నక్కా, పలు మత సంస్థలకు చెందిన నాయకులు జీవన్ జుత్షి, డాక్టర్ అనురాగ్ మైరల్, అజయ్ భుటోరియా, సంజీవ్ కెక్, లెబాన్ మ్యాథ్యూ, బిమాల్ భగత్, దీపక్ అవస్థి,సందీప్ మిట్టర్, సునీల్ వర్ఘీస్, అతుల్ షా, జయరాం కోమటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.