టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ సెన్సేషన్ శ్రీలీల చిక్కుల్లో పడ్డారు. నేటి రోజుల్లో విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది. తరగతికో రేటు కట్టడమే గాక.. ర్యాంకుల ఆశ చూపిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రైవేట్ విద్యాసంస్థలు ఎంతలా మోసం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ మారి సినీ తారలు అండగా నిలుస్తున్నారు. తప్పుడు ప్రచారంతో లక్షలాది మంది జీవితాలు నాశనం కావడానికి కారకులు అవుతున్నారు.
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తా పత్రికల్లో పేరు మోసిన రెండు టాప్ ప్రైవేట్ కాలేజీలు తమ యాడ్స్ రిలీజ్ చేశాయి. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు పొందారంటూ ఆయా విద్యాసంస్థలు గట్టిగా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఒక కాలేజీలో ఉన్న విద్యార్థినే వేరొక కాలేజీ యాడ్లోనూ దర్శనమిచ్చింది. స్టూడెంట్ ఒక్కరే అయినా.. వేర్వేరు కాలేజీలు.. వేర్వేరు యాడ్లు.. వేర్వేరు ర్యాంకులు.
అంటే ఇతర విద్యా సంస్థల నుండి ఆయా కార్పోరేట్ విద్యా సంస్థలు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ర్యాంకర్లను కొనుగోలు చేసి తమ కాలేజీలో చదువుకున్నట్లు చూపిస్తున్న విషయం మరోసారి స్పష్టమైంది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రమోటర్లుగా ఉన్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. వారి ప్రమోషన్ల వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయని.. అవేమి ఆలోచించకుండా ఆదాయాన్ని పెంచుకోవడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది.
పోలీసు వ్యవస్థ వెంటనే స్పందించి శ్రీలీల మరియు అల్లు అర్జున్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని.. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా మంత్రులు కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరూ ఉండకూడదని వెంటనే ప్రకటనలు విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలియజేసింది.