నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ గురించి రిలీజ్కు ముందు, తర్వాత ఎంత హడావుడి జరిగిందో తెలిసిందే. ప్రి రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా.. అన్నయ్య కాలర్ ఎగరేసి ఈ సినిమా మామూలుగా ఉండబోదని సంకేతాలు ఇచ్చాడు. రిలీజ్ రోజు ఈ సినిమా క్లైమాక్స్ గురించి నందమూరి అభిమానులు తెగ హడావుడి చేశారు.
సినిమా బ్లాక్ బస్టర్ అని టీం ప్రచారం చేసుకుంది. మంగళవారం, బుధవారానికల్లా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెబుతున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ హడావుడి చూసి జనం కూడా ఏదో అనుకున్నారు. కళ్యాణ్ రామ్కు పెద్ద హిట్ పడిందని అభిమానులు చెప్పుకున్నారు. తీరా చూస్తే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ అన్నది ట్రేడ్ వర్గాల మాట.
ఇంట్రెస్టింగ్ టీజర్, ట్రైలర్ వల్ల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’కి బిజినెస్ బాగానే జరిగింది. కానీ బయ్యర్ల పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం. ఈ సినిమా తొలి రోజు మాత్రమే సందడి చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఆశించిన వసూళ్లు రాలేదు. ఆదివారం కూడా థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఇక సోమవారం నుంచి అయితే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ పూర్తిగా పడకేసింది.
వీక్ డేస్లో చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయాయి. చివరికి చూసుకుంటే ఎక్కడా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. పైగా 40-50 శాతం నష్టాలే మిగిలాయి బయ్యర్లకు. ఇటు థియేట్రికల్ రైట్స్, అటు డిజిటల్ రైట్స్ ద్వారా మంచి రేటు తెచ్చుకున్న నిర్మాతలు బాగానే లాభాలు చూశారు కానీ.. బయ్యర్లకు మాత్రం దెబ్బ పడిపోయింది. గత వారం వచ్చిన మరో చిత్రం ‘ఓదెల-2’ పరిస్థితి కూడా ఇంతే. నిర్మాతలకు లాభాలు, బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.