మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చేరికకు అడ్డంకులు తొలగినట్లేనా..? త్వరలో అవంతి సైకిల్ ఎక్కడ ఖాయమా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. పార్టీలు మారడం అవంతికి కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ అవంతి శ్రీనివాస్.. 2009 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓడిపోవడంతో చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన అవంతి.. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా అవంతి వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా మళ్లీ భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగి.. గంటా శ్రీనివాసరావు పై గెలిచారు. ఆ తర్వాత జగన్ క్యాబినెట్ లో చోటు కూడా దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి అవంతికి సీటు ఇవ్వగా.. ఈసారి గంటా చేతుల్లో ఓడిపోయారు.
రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోవడంతో అవంతి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాయి. గత ఏడాది డిసెంబర్లో ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటినుంచి టీడీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శ అవంతి పై ఉంది. దానికి తోడు గంటా శ్రీనివాసరావు సైతం అవంతి టీడీపీ చేరికకు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే ఇటీవల టీడీపీ నాలుగు దశాబ్దాల తర్వాత గ్రేటర్ విశాఖను సొంతం చేసుకుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై వేసిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైసీపీ నుంచి చాలా మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. ఈ జాబితాలో అవంతి శ్రీనివాస్ కుమార్తె కూడా ఉన్నారు. ఈ పరిణామంతో అవంతి పై టీడీపీ అధిష్టానికి కొంత సానుకూలత ఏర్పడింది. గంటా కూడా కాస్త మెత్తబడటంతో.. అవంతి శ్రీనివాస్ చేరికకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.