ఒకప్పుడు ఉన్నత చదువులకు అగ్రరాజ్యమే ఆకర్షణీయమైన గమ్యస్థానం. అమెరికా లో చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదించడం కోసం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎందరో యువతీ యువకులు పోటీ పడుతుంటారు. ముఖ్యంగా పై చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారాయి. అమెరికా కలల నుంచి, భ్రమల నుంచి ఇండియన్ పేరెంట్స్ మెల్లగా బటయకు వచ్చేస్తున్నారు.
ట్రంప్ రాకతో ఈ ఏడాది అమెరికా వెళ్లి అక్కడి యూనివర్శిటీల్లో చదువుకోవాలనుకునే వారిలో సగం మంది డ్రాప్ అయ్యారు. ఫలితంగా భారతీయ విద్యార్థులపై ఆధారపడే చాలా అమెరికన్ యూనివర్శిటీలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఇందుకు కారణం ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలే. అమెరికా యూనివర్శిటీలో చదువుకుంటూ అక్కడ బతకాలి అంటే కచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే. అందువల్ల నూటికి ఎనభై శాతం మంది విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ స్టడీస్ కంప్లీట్ చేసేవారు. కానీ ఇప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేసే పరిస్థితి లేదు. యూనివర్సిటీ క్యాంపస్ లలో ఉద్యోగాలు ఉంటాయి. అయితే అవి అందరికీ రావు. దాంతో అక్కడి ఇండియన్ స్టూడెంట్స్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగాలు కూడా అంత సులభంగా రావడం లేదు.
అందుకు తోడు ట్రంప్ అందర్నీ వెళ్లగొట్టే ఆలోచనలో ఉన్నారు. ఓపీటీని కూడా రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే అమెరికాలో చదువు అయిపోయ్యాక తిరిగి స్వదేశానికి వచ్చేయాలి తప్ప.. అక్కడ ఉద్యోగం చేసేందుకు ఛాన్స్ ఉండదు. ఈ కారణంగానే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను అమెరికా పంపే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఇండియన్స్ కోసం అమెరికా భారీగా విద్యార్థి వీసాలు కేటాయిస్తోంది.
లక్షా నలభై వేలకు పైగా విద్యార్థి వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకురాగా.. కనీసం సగం కూడా అవి ఫిల్ అవ్వలేదట. గతంలో స్లాట్లు ఇలా ఓపెన్ అయ్యాయంటే అలా హాట్ కేకుల్లా అయిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కోటి వరకూ ఖర్చు పెట్టి అమెరికా వెళ్లి అష్టకష్టాలు పడుతూ చదువుకుని చివరకు ఉద్యోగం రాక ఇబ్బందులు పడే కన్నా.. తక్కువ ఖర్చుతో ఇక్కడే మంచి యూనివర్శిటీలో చదువుకుని క్యాంపస్ లోనే ఆఫర్ పొందడం బెటర్ అని భారతీయులు భావిస్తున్నారట.