మే 2న అమరావతి రాజధాని పనుల రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సభను విజయవంతం చేద్దామని కూటమి పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని చంద్రబాబు అన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూటమి పార్టీల నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.
కుటుంబం నివసించేందుకు మంచి ఇల్లు అవసరమైన మాదిరిగా ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం అని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణకు హైదరాబాద్ ద్వారా 70 శాతం ఆదాయం వస్తోందని, అమరావతి ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఆత్మ వంటిది” అని చెప్పారు.
అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, ఆ భూముల్లోనే రాజధాని నిర్మించడంతో పాటు తిరిగి వారికి రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తున్నామని చెప్పారు. కొన్ని వ్యతిరేక శక్తులు కుట్రతో ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయని, అభివృద్ధిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఆ దుష్ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను గురించి వారికి వివరించే బాధ్యతను ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని చెప్పారు.