పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నెలమట్టం చేసింది. ఈ దాడిలో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్ కొట్టిన దెబ్బకు పాక్ రగిలిపోతుంది. ఇప్పటికే ఆ దేశ సైన్యం సరిహద్దుల్లోని గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాక్ తిరిగి దాడులు చేయనున్న నేపథ్యంలో ఆప్రమత్తమైన భారత కేంద్రం.. ఉత్తర, పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల్లో 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా క్లోజ్ చేసింది. ఈ మేరకు భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) ఎయిర్మెన్ కు నోటీసులు జారీ చేసింది.
నివేదికల ప్రకారం, మే 10 వరకు ఈ ఆంక్షలు అమలులో కొనసాగుతాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం తాజా నిర్ణయంతో లేహ్, చండీగఢ్, అమృత్సర్ మరియు జోధ్పూర్ వంటి ప్రధాన కేంద్రాలతో సహా 27 విమానాశ్రయాలలో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. ఈ చర్య ఫలితంగా సుమారు 430 విమానాలు రద్దు చేయబడ్డాయి. అదేవిధంగా, పాక్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు విమానాశ్రయాలు, విద్యాసంస్థలను ముసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా పోస్ట్ పోన్ చేశారు.